నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 20: కరోనా బాధితుల్లో భయం పోగొట్టి.. భరోసా నింపేందుకు పలువురు మంత్రు లు, ప్రజాప్రతినిధులు కదిలారు. గురువారం సర్కారు దవాఖానల్లోని కొవిడ్ వార్డులను స్వయంగా సందర్శించారు. చికిత్సపొందుతున్న రోగులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనవసరంగా ఆందోళన చెందవద్దని, సర్కారు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్తో కలిసి కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖానను సందర్శించారు. కరోనాతో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అనంతరం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా యంత్రాంగంతో కొవిడ్ చికిత్సపై సమీక్షించారు. ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
కరోనా నియంత్రణ చర్యలు, వైద్య సేవలపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల అధికారులతో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా అధికారులు, వైద్యులతో సమీక్షించారు. ఎంజీఎం దవాఖానలో పీపీఈ కిట్ ధరించి కొవిడ్ వార్డును సందర్శించారు. శానిటేషన్ తీరును పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కరోనా విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని రక్షించుకొనేందుకు ప్రభుత్వం అన్నిరకాల వైద్యసేవలను అందిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి వనపర్తి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలోని ప్రభుత్వ దవాఖానల్లోని కొవిడ్ వార్డులను పరిశీలించారు. ప్రతి వార్డులో కలియతిరిగారు. బాధితులతో మాట్లా డి ధైర్యం నింపారు. వసతులపై మం త్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం వరంగల్ రానున్నారు. ఎంజీఎం హాస్పిటల్ను సందర్శించి కరోనా బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపనున్నారు. అందుతున్న వైద్య సేవలను తెలుసుకుంటారు. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. సెంట్రల్ జైలును వరంగల్ నగరం వెలుపలికి తరలించి ఆ ప్రదేశంలో అత్యాధునిక దవాఖానను నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ సెంట్రల్ జైలును పరిశీలించనున్నట్టు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.