యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మండే ఎండలు ఓవైపు.. కూలీల కొరత మరోవైపు.. ఓ రైతు వినూత్న ఆలోచనకు తెరతీశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన రెడ్డి మల్లారెడ్డి తనకున్న ఏడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. 24 గంటల కరెంటుకు తోడు సాగు నీళ్లు పుష్కలంగా ఉండటంతో పంట దిగుబడి బాగా వచ్చింది. ఒక్కో ఎకరాకు 45 బస్తాలపైనే దిగుబడి వచ్చింది. ధాన్యం విక్రయించేందుకు శుక్రవారం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతుకు తూర్పారా పట్టాలని సూచించారు. కూలీల కొరత కారణంగా మల్లారెడ్డి.. జేసీబీ యంత్రాన్ని వినియోగించి వడ్లు తూర్పారా పట్టారు. కూలీలతో రెండు రోజుల్లో అయ్యే పని రెండు గంటల్లో పూర్తవ్వడంతో అక్కడున్న ఇతర రైతులు ఆసక్తిగా చూశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని మల్లారెడ్డి సంబురంగా చెప్పాడు.