కరోనా సెకండ్ వేవ్ మూలంగా థియేటర్లు మూతపడటంతో అగ్రకథానాయకులు సైతం ఓటీటీల బాట పట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలోనే విడుదలకాబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ పుకార్లను చిత్రబృందం ఖండించింది. రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఓటీటీ వార్తలపై నిర్మాత మాట్లాడుతూ ‘ ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలో విడుదలకానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. చక్కటి కథ, కథనం, సాంకేతిక ప్రమాణాలతో థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం. థియేటర్లలోనే విడుదలచేస్తాం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా దర్శకుడు రమేష్వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఇటలీలో తీసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: జయంతి లాల్ గద.