హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఓపీ విభాగంలో కొవిడ్ వైద్య సేవలను పరిశీలించారు. కొవిడ్ చికిత్స, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. రోగులు, వైద్య సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు.
కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యత గురించి తెలుసుకున్నారు. ఆక్సిజన్, ఔషధాల కొరత రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.