హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణీలతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి వాటి వివరాలు సమర్పించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం అన్ని శాఖల అధికారులను ఆదేశించారని తెలిపారు. పశుసంవర్థక, మత్స్య శాఖల్లోని ఖాళీల వివరాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ‘‘యేటా రిటైర్మెంట్ ఖాళీలను అదే ఏడాది భర్తీ చేసేందుకు సీఎం కార్యాచరణ రూపొందిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అమలుతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు.
రానున్న రోజుల్లో పశుసంవర్థక, మత్స్యశాఖల ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, జీవాల పెంపకందారులకు అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో జీవాల సంఖ్య పెరిగింది. పట్టణాల్లోని పలు పశువైద్యశాలలకు వైద్య సేవల కోసం జీవాలు రావడం లేదు. అలాంటి చోట పని చేస్తున్న సిబ్బందిని, వివిధ దవాఖానల్లోని అదనపు సిబ్బందిని అవసరమైన చోటుకు బదిలీ చేయాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో భారీగా సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. పారిశుధ్య పనుల నిర్వహణకు రాష్ట్రంలోని 12 వేల 500 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే’’ అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.