హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 273 కోట్లు మొదటి విడతగా సీఎం కేసీఆర్ విడుదల చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబ్లెల్లి దయాకర్రావు తెలిపారు. అందులో గ్రామ పంచాయతీలకు రూ. 232.06 కోట్లు, మండల ప్రజా పరిషత్లకు రూ. 27.28 కోట్లు, జిల్లా ప్రజా పరిషత్లకు రూ. 13.65 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేసినంధుకు సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రణాళికాబద్దంగా గ్రామాల్లో అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత పెంపోందించాలన్న సంకల్పంతో అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు అవుతున్నాయన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నట్లు తెలిపారు. పల్లెల ప్రగతితో బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం సాకారం కాబోతుందని మంత్రి పేర్కొన్నారు.