న్యూఢిల్లీ : మైనింగ్ సంస్కరణలతో దేశ జీడీపీ పరుగులు పెట్టడంతో పాటు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు ముందుకు వస్తాయని పరిశ్రమ సంఘాల సంస్థ ఫిక్కీ పేర్కొంది. ఖనిజాల వెలికితీత, ఉత్పత్తి, దేశీ సరఫరాలను పెంచడంతో పాటు గనుల యజమానులపై ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించడం ద్వారా దేశ జీడీపీకి మైనింగ్ రంగం నుంచి భారీగా ప్రాతినిథ్యం పెరిగే చర్యలు చేపట్టాలని తాము చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఫిక్కీ పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి సులభతర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు తాజా సంస్కరణలు ఉపకరిస్తాయని స్వాగతించింది.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇటీవల మైనింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా జీడీపీకి ఈ రంగం నుంచి ప్రాతినిథ్యం పెరగడం వృద్ధికి ఊతమిస్తుందని ఫిక్కీ మైనింగ్ కమిటీ చీఫ్ తుహిన్ ముఖర్జీ పేర్కొన్నారు. సంస్కరణలతో మైనింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, సులభతర వాణిజ్యం సాధ్యమవుతాయని అన్నారు. మైనింగ్ రంగ సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్లో గనుల రంగం కీలకమని ప్రభుత్వం గుర్తించినట్టు వెల్లడైందని ఫిక్కీ మైనింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు, వేదాంత సీఈవో (అల్యూమినియం, పవర్) రాహుల్ శర్మ పేర్కొన్నారు. దేశంలో వేలం వేయని క్యాప్టివ్ గనులను సులభంగా బదిలీ చేసే ప్రక్రియను చేపట్టడం కూడా మైనింగ్ రంగ పురోగతికి ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు.