హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చురకలంటించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు.
కల్యాణలక్ష్మి పథకం ప్రారంభంలో కొంతమంది లంచాలు తీసుకున్నట్లు రిపోర్టు వచ్చింది. అప్పుడు రూ. 51 వేలు ఉండే. నా దగ్గరి మిత్రుడి ఇంట్లో ఓ పిల్లాడు పని చేస్తాడు. ఆ పిల్లోడికి పెళ్లి అయిన తర్వాత కల్యాణలక్ష్మి చెక్ వచ్చిందా? అని నా మిత్రుడు అడిగితే.. రూ. 51వేలకు బదులు.. నాకు రూ. 40 వేలు ఇచ్చిండు అని చెప్పిండంట. ఆయనొచ్చి నాకు చెప్పిండు. ఆ తర్వాత నేనే మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో ఆలోచించాను. అవును సర్.. నిజమే అని చెప్పారు.
కల్యాణలక్ష్మి చెక్ల పంపిణీనీ ఎమ్మెల్యే సూపర్వైజింగ్లో పెట్టాలని నిర్ణయించాం. ఎమ్మెల్యే సంతకం పెడితేనే చెక్ మంజూరు అవుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్లు పంపిణీ చేస్తున్నాం. రాజాసింగ్ ఎమ్మెల్యే.. మీకే సర్వాధికారాలు ఉన్నాయి. అలా జరుగుతుందంటే గవర్నమెంట్ కంటే మీకే ఎక్కువ అవమానం. అట్ల జరగనివ్వొద్దు. మీరంటే భయం లేదని అర్థమైతుంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్లు పంపిణీ చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. తొలిసారిగా వింటున్నాను. అలాంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.