ఢిల్లీ,జులై 3:భారతదేశంలో విద్యార్థులకు ఉపగ్రహ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించడానికి రంగం సిద్ధం చేసింది కేంద్ర సర్కారు. దేశీయ ఉపగ్రహాలన్నీ ఇస్రో ఆధీనంలో ఉన్నాయి. ఆయా సేవలను వినియోగించుకోవడానికి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదనలకు ఇస్రో అంగీకారం తెలిపింది.
అంతేకాదు రాష్ట్రాలకు శాటిలైట్ హక్కులను బదలాయించడానికి కూడా ఇస్రో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమవంతు సహకారం అందిస్తామని ఇస్రో ప్రకటించింది. వాటిని ఎలా వినియోగించాలనే అంశంపై సాంకేతిక సహకారాన్ని సైతం అందించడానికి సిద్ధమని స్పష్టం చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.
ఈ కారణంగా వారి విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల వచ్చిన గ్యాప్ను భర్తీ చేయడంలో సహకారం అందిస్తామని ఇస్రో తెలిపింది. శాటిలైట్ టీవీల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలనే విషయంపై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఇస్రో శాస్త్రవేత్తలు, దూరదర్శన్ అధికారులు హాజరయ్యారు.
అంతేకాకుండా ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్లకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించడంలో తమ ఆధీనంలో ఉన్న శాటిలైట్లను వినియోగించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వాటిని ఎలా వినియోగించాలనే విషయంపై అధికారులకు శిక్షణ కూడా ఇస్తామని, రాష్ట్రాలకు శాటిలైట్ల హక్కులను బదలాయించడానికి కూడా సిద్ధమని అన్నారు.