హైదరాబాద్ : ప్రతీ ఏడాది జులై 1వ తేదీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో వైద్య నారాయణులై తమవంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు.
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న గ్రహీత డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జయంతి, వర్థంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. బిధన్ చంద్రరాయ్ 1 జులై, 1882 న జన్మించారు. 1 జులై 1962 న పరమపదించారు. డాక్టర్ రాయ్ వైద్య రంగంలో ఎనలేని కృషి చేసిన గొప్ప వైద్యుడు. మానవాళికి సేవ చేయడంలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ గౌరవార్థంగా 1991 నుండి డాక్టర్ట్స్ డే ను పాటిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలందరికీ ఈ రోజు అంకితం చేయబడింది.