గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. అసోం ప్రజల ఆకాంక్షలకు తమ మేనిఫెస్టో అద్దం పడుతుందని రాహుల్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అసోం ఉనికిని దెబ్బతీసేందుకు కాషాయ పార్టీ పూనుకుందని మేనిఫెస్టో విడుదల చేస్తూ రాహుల్ విమర్శలు గుప్పించారు.
దేశ భిన్న సంస్కృతులు, భాషలపై బీజేపీ దాడికి తెగబడుతోందని దుయ్యబట్టారు. అసోం సంస్కృతిని గౌరవిస్తూ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా మేనిఫెస్టోకు మెరుగులుదిద్దామని చెప్పారు. అసోంలో తాము అధికారంలోకి రాగానే ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీ తోటల్లో కార్మికుల కనీస వేతనాలను రూ 365కు పెంచుతామని పేర్కొంది.