హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై అసెంబ్లీలో శుక్రవారం సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్కపై విసిరిన వ్యంగ్యాస్ర్తాలు సభలో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా పాముకాటు గురించి చెప్పిన ఓ పిట్టకథ హైలెట్గా నిలిచింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క చేసిన వ్యాఖ్యలపైనా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రతిపక్ష నేతల తిట్లే తమకు ఆశీర్వాదాలుగా మారాయన్నారు. ‘ఒక ఊళ్లో ఒకాయన పాము కరిచి సచ్చిపోయిండు. శవం అక్కడ ఉన్నది. వచ్చేవాళ్లు వస్తున్నరు.. పరామర్శ చేస్తున్నరు. పోయేవాళ్లు పోతున్నరు. భట్టి విక్రమార్క వంటి మిత్రుడు కూడా అక్కడికి వచ్చిండు. ఎందుకు చచ్చిపోయిండు అని ఆయన అడిగితే పాముకరిచింది అని పక్కాయన చెప్పిండు. యాడ కరించిందయ్యా? అని అడిగిండు. కనుబొమ్మ మీద కరిచిందయ్యా అని అనగానే.. ఇంకా నయం కొద్దిగా కింద కరిస్తే కన్ను పోతుండే కదా! అన్నడట. చెట్టంత మనిషే పోయిండు అంటే కన్ను ఉంటేంది? పోతే ఏంది?’ అని సీఎం కేసీఆర్ చెప్పగానే సభలో సభ్యులంతా పగలబడి నవ్వారు. ‘కరోనా ఘోరంగా దెబ్బకొట్టింది. మనమే మొత్తం బంద్ చేపిస్తిమి. కర్ఫ్యూలు పెడితిమి. ఇగ డబ్బులెక్కడి నుంచి వస్తాయి? అయినా తట్టుకొని నిలబడ్డం. ఇప్పటికీ కరోనా కన్ఫ్యూజన్ ఉన్నది. భగవంతుడి దయవల్ల మన దగ్గర కేసులు తక్కువే ఉన్నాయి. ఉన్నంతలో యథాశక్తి అందరినీ ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని అభినందించాలె కదా?’ అని ప్రతిపక్ష నేతను సీఎం కేసీఆర్ నిలదీశారు.
సంక్షేమంలో మనమే మేటి
సీఎం కేసీఆర్ ప్రసంగం చివర్లో మరోసారి భట్టి విక్రమార్కపై పంచ్లు విసిరారు. ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్ష నేత ఒక విషయంలో కాకుంటే మరో అంశంలోనైనా తమపై ప్రేమ కురిపిస్తారని భావించామన్నారు. ‘ఈరోజు ప్రసంగంలో కూడా వారి ప్రేమకు నోచుకోలేదు. అయినా బాధలేదు. ఇన్ని మంచి పనులు చేస్తున్నందుకు భవిష్యత్తులోనైనా ప్రేమ కలుగుతుందని అనుకుంటున్నం. ప్రతిపక్ష పార్టీ కాబట్టి సభలో ఇలా ఉంటున్నారే తప్ప.. ఆయన బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మాపై ప్రేమ కురిపిస్తున్నట్టు తెలిసింది’ అని సీఎం కేసీఆర్ అనగానే సభలో నవ్వులు విరిశాయి. సంక్షేమం ప్రజల హక్కు అని ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించగా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సామెతలు జోడించి గట్టిగా సమాధానం ఇచ్చారు. ‘సంక్షేమం ప్రజల హక్కు అని.. మీరిచ్చే భిక్ష కాదని వారు అన్నారు. వారు అప్పుడు టీడీపీలో ఉండే.. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. రెండు ప్రభుత్వాల హయాంలో ఇచ్చింది రూ.200 పింఛనే. మేం రూ.2 వేలు ఇస్తున్నం. మాటలు కోటలు దాటినా కాళ్లు తంగెళ్లు దాటలేదన్నట్టు.. వాళ్లు మాటలకే పరిమితమైనరు. మేము ఆచరణలో చూపెడుతున్నం. అదే తేడా. ఏనాటికైనా సంక్షేమంలో దేశంలోనే నంబర్వన్గా నిలుస్తామని నేను తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల్లో చెప్పిన. ఈరోజు మనం సంక్షేమానికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇది ప్రజల అనుభవంలో ఉన్నది’ అని సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.