బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు సీఎం కేసీఆర్ చురక
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో దళారులు పర్సంటేజీలు తీసుకుంటున్నారని ప్రస్తావించారు. దీనిపై కల్పించుకున్న సీఎం కేసీఆర్.. ‘మీరంటే భయం లేదేమో. అందుకే అలా జరుగుతుంది. అలా జరిగితే మీకే అవమానం’ అంటూ రాజాసింగ్కు చురకలంటించారు. ‘కల్యాణలక్ష్మి స్కీమ్ ప్రారంభించినప్పుడు కొంతమంది అక్కడక్కడ లంచాలు తీసుకుంటున్నరని నాకే రిపోర్ట్ వచ్చింది. అప్పుడు రూ.51 వేలే ఉండే. నా దగ్గరి మిత్రుడొకాయన ఇంట్లో పనిచేసే సర్వెంట్ లంబాడా పిల్లవాడికి పెండ్లయింది. ఎంతిచ్చిన్రు అంటే.. 51 వేలకు చెక్కు వచ్చింది, నాకు 40 వేలే ఇచ్చిన్రు, 11 వేలు పట్టుకున్నరని చెప్తే ఆయనొచ్చి నాకు చెప్పిండు. అన్నా గింత మంచి పథకమిది. ఇట్ల జరుగుతుందేంది అన్నడు. లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పిలిచి నిజమేనా అంటే కొంతవరకు మేం కూడా వింటున్నం సర్. నిజంగా బాధైతుందని కొంత మంది ఎమ్మెల్యేలు చెప్పిన్రు. భయముంటది, భక్తి ఉంటదని ఎమ్మెల్యే గారి సూపర్విజన్లోనే పెట్టినం. చెక్కు కూడా ఎమ్మెల్యే సంతకం పెడితేనే వస్తుంది. ఎమ్మెల్యేకు నెట్వర్క్ ఉంటది. పిల్లకోడిలెక్క సర్పంచ్లు అంతా ఎమ్మెల్యే దగ్గరికే వస్తరు. ప్రతిబూత్తో సంబంధముంటది. ఎమ్మెల్యేగారికి ఏమన్న డౌట్వస్తే ఒక సెకన్ల ఫోన్చేసి కనుక్కోగలగుతడు. ఇంతకుమించిన చెక్ లేదు రాజాసింగ్గారు. మీరే ఎమ్మెల్యే. మీకే సర్వాధికారాలున్నాయి. అట్ల జరుగుతుందంటే గవర్నమెంట్ కన్నా మీకే ఎక్కువ అవమానం. నిజంగా చెప్పాలంటే అట్ల జరగనీయొద్దు. మీరంటే భయంలేదని అర్థమైతాంది. ఎమ్మెల్యేల ద్వా రా చెక్కులు పంపిణీ చేసిన తర్వాత ఈ రోజువరకు ఎక్కడ నుంచి షికాయత్రాలేదు. నేనైతే వినలేదు. ఇదే ఫస్ట్ వింటున్న. సీఎస్గారు. ఫైనాన్స్ సెక్రటరీగారు సైతం మీ ప్రసంగాన్ని వింటున్నరు. అటువంటి తప్పు జరిగితే చర్యలు తీసుకుంటం’ అని రాజాసింగ్కు సీఎం కేసీఆర్ బదులిచ్చారు.
తెలంగాణలోని ఏముక్కైనా మనదే
‘రాజాసింగ్ గారు నిన్ననే నా చాంబర్లు కలిస్తే చెప్పిన. దూల్పేట విషయంలో సమగ్ర కార్యాచరణ తీసుకుంటం. అక్కడున్న సోషల్ స్టిగ్మా మనకు మంచిదికాదు. డెఫినెట్గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు, ఎక్సైజ్, వెల్ఫేర్ టీంను ఏర్పాటుచేసి అక్కడి పరిస్థితులను సెటిల్చేస్తాం. దానికి డౌట్ అవసరంలేదు. తెలంగాణలోని ఏ ముక్కయినా మనదే కనుక అక్కడి పరిస్థితులను మెరుగుపరుస్తమని హామీ ఇస్తున్న’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.