హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని కేసీఆర్ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించామని చెప్పారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్లో సీఎస్, డీజీపీతో పాటు రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా పాల్గొన్నారు.