జల వనరుల శాఖకు కొత్త రూపు

- పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరణ
- భారీ, మధ్య, చిన్న నీటిశాఖలకు ఒక్కరే అధికారి
- 19 ప్రాదేశిక ప్రాంతాలు-ఒక్కో దానికి ఒక్కో సీఈ
- ఆరుగురు ఈఎన్సీలు.. కొత్తగా 945 పోస్టులు
- అత్యంత ప్రాధాన్యాంశాలుగా ప్రాజెక్టుల పూర్తి
- 2021 జూన్లోగా చనాక-కొరట పూర్తిచేయాలి
- హుజూర్నగర్ ఎత్తిపోతల పథకం మంజూరు
- జలవనరులశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
- ఇరిగేషన్ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రగతిభవన్లో జలవనరులశాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై.. రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారుచేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జలవనరులశాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరించారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.
19 ప్రాదేశిక ప్రాంతాలు
రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలుగా ఉంటాయి.
ఇకపై ఆరుగురు ఈఎన్సీలు..
ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్లో బాధ్యతలు అప్పగించారు.
అత్యంత ప్రాధాన్య అంశంగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలి
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలకు దెబ్బతిన్న అన్ని చెరువులకు మరమ్మతులు
ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మం త్రులు సీ లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖానాయక్, ఆత్రం సక్కు, హన్మంత్ షిండే, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు సీ మురళీధర్, బీ నాగేంద్రరావు, హరిరామ్, సీఈ వీ రమేశ్, సీఎంఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, సలహాదారు కే పెంటారెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ ఎం అనిత, డీడీఏ కేఆర్ చందర్రావు, ఎస్ఈ ఎస్ భీమ్ప్రసాద్, డీడీఎం సాజిద్, కే ప్రసాద్ పాల్గొన్నారు.
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
- వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తిచేయాలి.
- వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి.
- పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తిచేయాలి.
- అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలి. దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలి.
- హుజూర్నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నాం.
అదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. చనాక-కొరట ప్రాజెక్టు బరాజ్, పంపుహౌస్, కాల్వలను 2021 జూన్ లోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్తోపాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్టి ప్రాజెక్టు, మహబూబ్నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
భారీగా పెరిగిన పోస్టులు
ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరుచేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు చేరుకొంటుంది. సీఈ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్ఈల పోస్టులు 47 నుంచి 57కు, ఈఈల పోస్టులు 206 నుంచి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుంచి 2,796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుంచి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుంచి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుంచి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుంచి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుంచి 238కి, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుంచి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనావేశారు.