కరీంనగర్ : ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణం అని తెలిపారు. ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పట్టుపడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం కేసీఆర్ అన్నారు.
ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. కరెంటును నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది రాష్ట్రం. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా ప్రభుత్వం నిలిచింది. అన్ని రంగాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను, స్ఫూర్తిని అందిస్తున్నది అని కేసీఆర్ పేర్కొన్నారు.
రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించినం. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాల బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నాం. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్ధిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన. దళితబంధు గత సంవత్సరం మే నెలలోనే ప్రారంభమయ్యేది ఉండే, కానీ కరోనా కారణం చేత ఆలస్యమైంది అని కేసీఆర్ తెలిపారు.