పటాన్చెరు, మే 12 : లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగురోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల్లో వెళ్తున్న వారి వివరాలను పోలీసులు తెలుసుకుంటుండగా వాటిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు లాక్డౌన్ విధించిందని తనిఖీలు చేసి ప్రజలకు వదలాలని, పత్రాలు లేకుండా, టైంపాస్కు రోడ్లపై చక్కర్లు కొడుతున్నవారిపై కఠినంగా ఉండాలని ఎస్పీ పోలీసులకు సూచించారు. జిల్లాలో రెండు షిప్టులుగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, ముత్తంగి వంటి ముఖ్య కేంద్రాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఊర్లకు వెళ్లే వారికి ప్రత్యేక పాస్లు తప్పనిసరి
లాక్డౌన్ కారణంగా సొంతూర్లకు వెళ్లే వారు ఈ- పాస్తో ప్రత్యేక పాసులు తీసుకోవాలని ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి బుధవారం ప్రజలకు ఓ ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో జీవనోపాధికి ఇబ్బందులకు గురికాకుండా ముందు జాగ్రత్తగా ప్రజలు వారి ప్రాంతాలు, గ్రామాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ-పాస్ విధానంతో ప్రత్యేక పాసులు అందజేస్తామని ఎస్పీ వెల్లడించారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రలకు వెళ్లేవారు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ప్రయాణించే వారికి మాత్రమే పాస్లను జారీ చేస్తామని, ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణ రాష్ర్టానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ర్టాల నుంచి పాస్లు జారీ చేస్తారని ఎస్పీ తెలిపారు.