హైదరాబాద్ : మే 28. తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పరిశోధనాకారుడిగా, తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన రాజకీయ, సాంఘీక, సాహిత్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని సీఎం కీర్తించారు. పురాణాలను, చరిత్రను, సామాజిక చైతన్యాన్ని, సాహితీ సృజనను వినూత్న కోణంలో ఆవిష్కరించి, తెలంగాణ వైభవాన్ని లోకానికి సాధికారికంగా సత్ ప్రమాణాలతో నిరూపించారని కొనియాడారు.
‘గోలకొండ పత్రిక’ ద్వారా సురవరం తీసుకొచ్చిన జన చైతన్యం స్ఫూర్తిదాయకం అన్నారు. హిందూ జీవన విధానంలో అంతర్భాగమైన పండుగలు, సాంప్రదాయాల్లో నిగూఢంగా ఉన్న విలువలను శాస్త్రీయంగా వెలుగులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డిదన్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణంలోని ఎన్నెన్నో తెలియని కోణాలను సోదాహరణంగా వివరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి., తెలుగు ప్రజల సాంఘిక చరిత్రను ఆధారాలతో సహా నమోదుచేసిన ఆ ఘనత సురవరం గారికే దక్కిందని పేర్కొన్నారు.
తెలంగాణలో పండితులు, పద్యకవులు లేరనే మాటను సవాలుగా తీసుకొని ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రత్యేకంగా ముద్రించారాన్నారు. తద్వారా, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి తెలంగాణ సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణావాది , తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి సురవరం ప్రతాపరెడ్డి అని సీఎం కేసీఆర్ తెలిపారు.