హాలియా, ఏప్రిల్ 11 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఈ నెల 14న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎస్పీ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన లక్షా 53 వేల మందితోపాటు ప్రజలు స్వచ్ఛందగా సభకు తరలివచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు సీఎం బహిరంగ సభకు వస్తారని మంత్రి తెలిపారు. ఈ సభ ద్వారా నియోజకవర్గంలో చేపట్టాల్సిన రహదారులు, వాగులపై వంతెనల నిర్మాణంపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. సభ నిర్వహణలో కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నాగార్జున సాగర్ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి జానారెడ్డే కారణమని విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు 2023 ఎన్నికల్లో జానారెడ్డే కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. సభాస్థలిని సందర్శించిన వారిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నాయకులు చాడా కిషన్రెడ్డి, మల్గిరెడ్డి లింగారెడ్డి, పల్లా ప్రవీణ్రెడ్డి తదితరులు ఉన్నారు.