‘పల్లె ప్రగతి’లో ముందుకుసాగని సీతారాంపూర్
పిల్లర్లకే పరిమితమైన శ్మశానవాటిక
ప్రకతి వనంలో ఎండిపోతున్న మొక్కలు
అంతర్గత రహదారి వెంట నిలిచిన మురుగునీరు
పట్టింపులేక అసంపూర్తిగా పనులు
గణపురం, మార్చి 23:పల్లె ప్రగతితో అభివృద్ధి బాట పట్టాల్సిన ఆ గ్రామం.. పట్టింపులేక లక్ష్యానికి దూరంగా ఉంది. జీపీ పాలకవర్గ సభ్యులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తి పనులతో వెనుకబడింది. ప్రకృతి వనం ఏర్పాటుచేసినా అందులోని మొక్కలను సంరక్షించకపోవడంతో ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తోంది. అలాగే పిల్లర్లకే పరిమితమైన శ్మశానవాటిక, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్ల వెంట నిలుస్తున్న మురుగునీటితో ఊరు కంపుకొడుతోంది.
పక్కా ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తుంటే.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని సీతారాంపూర్లో మాత్రం పల్లె ప్రగతి పనులు ఎక్కడికక్కడే అన్నట్లు ఉన్నాయి.
ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరుచేసినా నిర్లక్ష్యం, పర్యవేక్షణ కరువై ప్రజలకు ప్రగతి ఫలాలు అందడం లేదు. ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు గాను ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేసింది. అందులో భాగంగానే సర్పంచ్ చొరవతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. కానీ మొక్కలను సంరక్షించడం మరిచారు. అలాగే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రధాన రహదారి వెంట ఉన్న సైడ్ కాల్వల వెంట మురుగు నీరు నిల్వ ఉంటోంది. ఇదిలా ఉంటే శ్మశానవాటిక పనులు ఇంకా పూర్తికాలేదు. పిల్లర్ల స్థాయిలోనే ఉండడం అధికారులు పనితీరుకు అద్దంపడుతోంది. సెగ్రిగేషన్ షెడ్ పక్కనే చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తున్నా.. తీసే వారు లేరు.
పర్యవేక్షణ కరువు..
పల్లె ప్రకృతి వనాలపై అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే మొక్కలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఎక్కడచూసినా మురికి నీరు నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నర్సరీలో కూడా మొక్కలు తక్కువగా గడ్డి ఎక్కువగా ఉంది. ఇలా అసంపూర్తి పనులతో గ్రామ ప్రగతి కుంటుపడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పల్లె ప్రగతి పనులను పూర్తిచేయాల్సిన అవసరముంది.