సింగరేణి ప్రాంత యువకుల ఎంపిక
సత్ఫలితాలనిచ్చిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ
మంచిర్యాల టౌన్ (శ్రీరాంపూర్), ఏప్రిల్ 2 : సింగరేణి సంస్థ.. సమీప గ్రామాల్లోని యువకులు, కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో 10 ఏరియాల్లో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణా శిబిరాలు సత్ఫలితాలను ఇచ్చాయి. సికింద్రాబాద్ సమీపంలోని హకీంపేటలో మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సింగరేణి ద్వారా శిక్షణ పొందిన యువకుల్లో 96 మంది శరీర దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం జరిగిన మెడికల్ పరీక్షలో ఇందులో నుంచి 73 మంది ఉత్తీర్ణులై, ఫైనల్ రాత పరీక్షల కు ఎంపికయ్యారు. దీనిపై సేవా సమితి ఉపాధ్యక్షుడు, జీఎం కో-ఆర్డినేషన్ కే సూర్యనారాయణ, సేవా సమితి సింగరేణి చీఫ్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాథమిక పరీక్షల్లో ఎంపికైన 73 మంది మే నెలలో జరగనున్న రాత పరీక్షకు సిద్ధమవుతున్నారు. కరోనా మళ్లీ వి జృంభిస్తున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈ ఏడాది సింగరేణి సంస్థ రాత పరీక్ష నిర్వహించలేకపోతున్నదని, అయితే అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా సహకరించనున్నామని యాజమాన్యం తెలపించి. 73 మందిలో జనరల్ డ్యూటీ సోల్జర్ విభాగానికి 41 మంది, ట్రేడ్స్మన్ విభాగానికి 27 మంది, నర్సింగ్, క్లర్కుల విభాగానికి ఐదుగురు ఎంపికయ్యారు. కార్మికుల కుటుంబాల నుంచి ఐ దుగురు యువకులు కాగా, ఓసీపీల ప్రభావిత గ్రామాలు, పట్టణాలకు చెందిన రైతులు, రైతు కూలీల కుటుంబాల నుంచి మిగతావారు కావడం విశేషం. రాత పరీక్షలో 100 శాతం ఉత్తీర్ణులమవుతామని యువకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
50 రోజులు ఉచిత ప్రీ ఆర్మీ శిక్షణ..
సింగరేణి వ్యాప్తంగా సేవా సమితి ఆధ్వర్యంలో 10 ఏరియాల్లో 50 రోజుల పాటు కార్మికుల, ఓసీపీల ప్రభావిత గ్రామాల యువకులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ఉచిత శిక్షణ ఇచ్చింది. యేటా ఈ శిక్షణ కొనసాగుతున్నది. సింగరేణి శిక్షణతో ఇప్పటి వరకు 15 ఏళ్లలో 1100 మందికిపైగా యువకులు ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువకులు సంస్థ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ పొందుతున్నారు. గతేడాది సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ సూచన మేరకు తొలిసారిగా 3 నెలల పాటు రెసిడెన్షియల్ తరహా శిక్షణ కూడా సేవా సమితి ఇచ్చింది. 300 మందిని ఎంపిక చేసి భోజన వసతి సమకూర్చింది. దీంతో గతేడాది ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో 272 మంది యువకులు పాల్గొన్నారు. వారిలో శరీర దారుఢ్య పరీక్షల్లో 162 మంది ఉత్తీర్ణులవగా, తదుపరి వైద్య పరీక్షల్లో 114 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత జరిగిన రాత పరీక్షల్లో 35 మంది యువకులు ఉద్యోగాలు సాధించారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రోజువారీగా ఉదయం సాయంత్రం శరీర దారుఢ్య శిక్షణ నిర్వహించగా, 500 మంది యువకులు పాల్గొన్నారు. వీరిలో ప్రధానంగా ఓసీపీ ప్రభావిత గ్రామాలు, పట్టణాల రైతుల కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువకులే ఉన్నారు. ర్యాలీకి హాజరైన యువకులకు యాజమాన్యం అన్ని విధాలా సౌకర్యాలు కల్పించింది.