సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): నాలుగేండ్లలో 1500 స్వచ్ఛంద సంస్థలకు వారధిగా నిలిచారు. రూ.70 కోట్ల క్రౌడ్ ఫండ్ సమకూర్చి వేలాది మందికి భరోసాగా మారారు. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో ఏకంగా రూ.55 కోట్లు సమకూర్చారు. రోగులకు కావాల్సిన వైద్య సామగ్రి అందించారు. తాజాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో పాటు వైద్య పరికరాలను ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు నడుం బిగించారు డొనేట్ కార్ట్(DONATE KART) సభ్యులు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ కౌన్సిల్తో ఒప్పందం చేసుకున్నారు.
ఆన్లైన్ వేదికగా..
దాతలు చేస్తున్న సాయం.. భాదితులకు సక్రమంగా అందుతుందా అన్న అనుమానాలు తలెత్తకుండా హైదరాబాద్కు చెందిన సందీప్ కుమార్, అనిల్ ఆన్లైన్ వేదికను ప్రారంభించారు. నాగ్పూర్ ఐఐటీలో చదివిన వీరిద్దరూ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. ఆ సమయంలో పలువురు దాతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేగాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకు వచ్చే దాతలు.. వారిచ్చే సామగ్రిపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా పని చేసేందుకు అనేక ఎన్జీవోలు ఉన్నాయని గుర్తించిన వారు ఓ ఆలోచన చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయం తెరిచి
https://WWWdonatekart.com వెబ్సైట్ను రూపొందించారు. దేశవ్యాప్తంగా 1500 స్వచ్ఛంద సంస్థలను సభ్యులుగా అందులో చేర్చారు. ఎవరైనా దాతల సాయం కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో నమోదు చేసుకొని వారికి కావాల్సిన అవసరాన్ని వివరించాలి. అప్పుడు వారి విజ్ఞప్తిని ఎన్జీవోలు, దాతలు పరిశీలించి నేరుగా వెళ్లి సాయం చేస్తారు. ఇలా నాలుగేండ్లలో దాదాపు రూ.70 కోట్ల క్రౌడ్ ఫండింగ్ సమకూర్చి నిస్సాహాయులు, పేదలు, నిరాశ్రయులకు లబ్ధి చేకూర్చారు. కేవలం కొవిడ్ పంజా విసిరిన కాలంలోనే రూ. 55 కోట్ల క్రౌడ్ ఫండింగ్తో అనేక వర్గాలకు సాయం చేశారు. దీంతో డొనేట్ కార్ట్ వ్యవస్థాపకుల కృషిని గుర్తించిన నాస్కామ్ 2018లో ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపిక చేయగా.. మంత్రి కేటీఆర్ వారికి అందజేశారు.