హైదరాబాద్ : ఎస్సీల మీద చేయి పడితే తెలంగాణ ప్రభుత్వం ఊరుకోబోదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన మరియమ్మ లాకప్డెత్ ఘటనలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. లాకప్డెత్ కేసులో నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని అన్నారు. ఎస్సీ మహిళ లాకప్డెత్ చాలా బాధకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. స్వయంగా ఖమ్మం జిల్లా చింతకాని వెళ్లి పూర్వాపరాలు విచారించాలని చెప్పారు. మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. అదేవిధంగా నివాస గృహాంతోపాటు కుమారుడికి రూ. 15 లక్షలు, ఇద్దరు కుమార్తెలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఎస్సీల పట్ల సమాజ ధృక్పథం మారాలని సీఎం పేర్కొన్నారు. ఎస్సీలు, పేదల పట్ల పోలీసులు ఆలోచన ధోరణి మారాలని అన్నారు. ఎస్సీలకు అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు సీఎల్పీనేత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను కలిసి మరియమ్మ లాకప్డెత్తోపాటు పలు అంశాలపై ఆయనకు వినతిపత్రం సమర్పించారు.