హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏ లిప్టుకాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ శాఖాధికారులను కేసీఆర్ ఆదేశించారు.
కృష్ణాబేసిన్లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతి, వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మతులు, వాటి పరిస్థితి, తదితర సాగు నీటి అంశాలపై మంగళవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జి. జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి,ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మంత్ షిండే,శానంపూడి సైదిరెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ఓస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఈఎన్సీలు హరిరామ్, వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వానకాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా వున్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సూచించారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో నారుమడి సిద్ధంచేసుకునేందుకు నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలన్నారు.
కాళేశ్వరం రాడార్లో ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలన్నారు. కాల్వల మరమ్మతులు కొద్దిపాటి కొరవలు మిగిలి ఉన్నాయని.. వాటిని సత్వరమే పూర్తి చేసుకోవాలన్నారు. మొదటి దశ కరోనా కష్టకాలంలో రైతు పండించిన పంట ద్వారా 17 శాతం ఆదాయం అందించి రాష్ట్ర జీ.ఎస్.డీ.పీ.లో తెలంగాణ వ్యవసాయం భాగస్వామ్యం పంచుకున్నదన్నారు. రాష్ట్ర రెవెన్యూకు తెలంగాణ వ్యవసాయం వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితికి నేడు తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు.
ఇరిగేషన్శాఖ కృషితో తెలంగాణ సాగునీటి రంగం, వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయిందని సీఎం అన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నేడు పంజాబ్ తర్వాత రెండో పెద్ద రాష్ట్రంగా అవతరించిందన్నారు. ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తుండడంతో సమృద్ధిగా పంటలు పండిస్తున్నారన్నారు. ప్రాజెక్టు జలాలతో తెలంగాణ బోరుబావులు స్థీరికరించబడ్డాయన్నారు.
30 జూన్ వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి దుమ్ముగూడెం దాకా అక్టోబర్ నెలాఖరు దాకా నీటి లభ్యత వుంటుందన్నారు. వెంట వెంటనే నీటిని పంపులద్వారా ఎత్తిపోసి చెక్ డ్యాం లను, చెరువులు, కుంటలు నింపుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. అదే సందర్భంలో తాగునీటికి లోటురాకుండా చూసుకుంటూ రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించాలని అన్నారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజర్వాయర్లలో ఎం.డి.డి.ఎల్. మెయింటేన్ చేయాలని ఇరిగేషన్ అధికారలకు సీఎం సూచించారు.
ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టు దాకా నీటికొరత లేకుండా చేశామన్నారు. హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామలకు మల్లన్న సాగర్ వరంలా మారనున్నదని సీఎం తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందనీ, దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. ఇదే విధంగా మిగతా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు సూచించారు.
నిరంతరం డైనమిక్గా ఉండే ఇరిగేషన్ శాఖలో ఒక్కరోజు కూడా ఏ పోస్టు కూడా ఖాళీగా వుండరాదని సీఎం అన్నారు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖకున్న ప్రత్యేకావసరాల దృష్ట్యా నియామక ప్రక్రియను బోర్డుద్వారా స్వంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేస్తామన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఖాళీల నివేదికను తనకు తక్షణమే అందజేయాలని ఈఎన్సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు. కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడుతామని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి, వాటి పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. స్టేటస్ రిపోర్టు అందచేయాలని ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక బృందాన్ని పంపి బ్యారేజీ నిర్వహణకు సంబంధించి ఇంజనీర్లకు ట్రెయినింగ్ ఇవ్వాలని ఆదేశించారు.
మేజర్ లిఫ్టులు, పంపులు వున్న దగ్గర స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టి, తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాంట్రాక్టర్ల క్యాంపుల కోసం భూసేకరణ నిలిపివేయాలన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మూడో పంప్ హౌజ్ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు.
మైలారం ట్యాంకునుంచి సూర్యాపేట తుంగతుర్తి దిక్కుగా కాళేశ్వరం నీటిని తీసుకపోయే డీబీఎం 71 కాల్వ లైనింగ్ పనులను చేపట్టాలని సీఎం ఆదేశించారు. హల్దీవాగు ప్రాజెక్టు కాలువ అధునీకీకరణ పనులను చేపట్టి 7 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్నారు. తూర్పు అదిలాబాద్ లోని మంచిర్యాల, కాగజ్ నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు నిర్మాణం చేయబోతున్న లిఫ్టుల కోసం ఆయకట్టు సర్వేను చేపట్టడానికి వాప్కోస్ సంస్థతో సంప్రదింపులు జరుపాలని సీఎం ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా సంగమేశ్వర లిఫ్టు, బసవేశ్వర లిఫ్టు పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సత్వరం డీపీఆర్ లు తయారు చేయించాలని ఆదేశించారు.
గోదావరి, కృష్ణా బేసిన్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న చిన్నా పెద్దా ప్రాజెక్టులన్నిటి పనుల పురోగతిని సిఎం పేరు పేరునా రివ్యూ చేశారు. సాధ్యమైనంత త్వరలో వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఎటువంటి వ్యూహాన్ని కార్యాచరణను అనుసరించాలో సీఎం ఇరిగేషన్ శాఖ అదికారులకు వివరించారు. సాగునీటి ప్రాధాన్యత తెలంగాణకు ఎంతగా అవసరమున్నదో మరోసారి కూలంకషంగా సీఎం విశదీకరించారు.