హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ ప్రబలుతున్నందున గ్రేటర్ హైదరాబాద్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాఖ అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్లతో శనివారం మంత్రి ఫోన్లో మాట్లాడారు.
కొవిడ్ తీవ్రత దృష్ట్యా అన్ని పురపాలికల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని, హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఆదేశించారు.
మున్సిపాలిటీలో అందుబాటులో ఉన్న వాహనాలతోపాటు అవసరమైన చోట అద్దెకు తీసుకుని పిచికారీ చేయాలని చెప్పారు. పనుల నిర్వహణకు పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని సూచించారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున శాఖ పరిధిలోని ఎంటమాలజిస్టులంతా అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగులంతా విధిగా విధులకు హాజరు కావాలన్నారు.
ఆరోగ్యశాఖ అధికారులతో మున్సిపల్శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కొవిడ్ నియంత్రణపై ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీలో రేపటికల్లా వందశాతం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి అవుతుంది అని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో 2-3 రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు.