వరంగల్ : తెలంగాణ సిద్ధాంతకర్త , ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. జయశంకర్ సార్ చాలా గొప్ప వ్యక్తి. ఏడెనిమిది సంవత్సరాలు కలిసి పని చేశాం. సచ్చేదాకా తెలంగాణ సాధించాలనే ఉందని జయశంకర్ సార్ చెప్పేవారు. కానీ తెలంగాణ రాకముందే సార్ చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు.
విద్యార్థి దశ నుంచి చివరి దశ వరకు ఒకే నినాదం, సిద్ధాంతం మీదున్న వ్యక్తి జయశంకర్ సార్. ఆయనను ఎంత తలుచుకుంటే అంత తెలంగాణకు బర్కత్ ఉంటుంది. అలాంటి మహానీయుడు పుట్టిన జిల్లా ఈ వరంగల్ జిల్లా. తెలంగాణ ఏర్పడే తరుణంలో నాలుగు నెలల ముందు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలపై చర్చించాం. మిషన్ కాకతీయ పేరును ఆ సమావేశంలోనే నిర్ణయించామన్నారు. జయశంకర్ సార్ ధన్యజీవి. ఆయన ఏదైతే కోరిండో ఇవాళ నెరవేరింది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.