హైదరాబాద్ : భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే తన దృఢ సంకల్పం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేతలంతా కలిసి రావాల్సిందిగా సీఎం కోరారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగిందన్నారు. కాగా మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక, తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలన్నారు.
దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలని సీఎం అన్నారు. గోరేటి వెంకన్నగల్లీ చిన్నది, గరిబోళ్ల కథ పెద్దది.. పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా ఆర్ధిక సాయం అందే విధంగా అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అఖిలపక్ష నేతలను సీఎం కోరారు.
దళితుల అభివృద్ధికి రాబోయే మూడు, నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలన్నారు. అట్టడుగున ఉన్న వారినుంచి సహాయం ప్రారంభించాలన్నారు. వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి రూ. 1000 కోట్లు కేటాయించాలనుకున్నట్లు వివరించారు. అవసరమైతే మరో రూ. 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ బడ్జెట్, ఎస్సీ సబ్ ప్లాన్కు అదనం అని తెలిపారు.