యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత కాన్వాయ్లో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఉన్నారు.
మరికాసేపట్లో యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. పూర్తికావస్తున్న పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను మధ్యాహ్నం 3:30 గంటలకు మీడియాకు సీఎం తెలియజేస్తారు.