నడిగూడెం, జూన్ 29 : పల్లె ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జూలై 1 నుంచి 10వరకు జరిగే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ నాలుగు మొక్కలు నాటి హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు.
మేళ్లచెర్వు : పల్లెప్రగతి విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ కొట్టె పద్మా సైదేశ్వర్రావు, మండల ప్రత్యేకాధికారి శ్రీధర్ సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పల్లెప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు, హరితహారం, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ఇసాక్హుస్సేన్, ఎంపీఓ వీరయ్య, వైస్ ఎంపీపీ గాయం గోపిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
పాలకవీడు : పల్లె ప్రగతి పనులను చిత్తశుద్ధితో నిర్వహించాలని ఎంపీపీ భూక్యా గోపాల్ సూచించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో పల్లె ప్రగతిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శంకర్, ఎంపీడీఓ జానయ్య, ఎంపీఓ దయాకర్, ఏపీఓ నగేశ్, ఎంపీటీసీలు ఉపేందర్, వెంకటయ్య, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మఠంపల్లి : ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పార్వతీకొండానాయక్ అధ్యక్షతన సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి, ఏపీడీ పెంటయ్య మాట్లాడుతూ హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల విజయవంతానికి ఎంపీడీఓ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు గ్రామాల్లో తిరిగి అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీఓ జానకిరాములు, ఎంపీఓ నరేశ్, ఏపీఓ ఉమ, పాల్గొన్నారు.
నేడు అవగాహన సమావేశం
గరిడేపల్లి : పల్లె ప్రగతిపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పెండెం సుజాత అధ్యక్షతన బుధవారం అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు ఇన్చార్జి ఎంపీడీఓ వనజ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి జడ్పీటీసీ పోరెడ్డి శైలజ హాజరవుతారని పేర్కొన్నారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది సకాలంలో హాజరుకావాలని కోరారు.