కేపీహెచ్బీ కాలనీ, జూన్ 7 : జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి సర్కిల్ ఆఫీస్లో టీఎస్బీపాస్ చట్టం అమలుపై టౌన్ప్లానింగ్, న్యాక్ ఇంజినీర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో అనుమతులు లేకుండా, అనుమతులకు విరుద్ధంగా నిర్మించే భవనాల వివరాలను సేకరించాలన్నారు. ఐదు సర్కిళ్లలో 22 వార్డులకు గాను 14 మంది న్యాక్ ఇంజినీర్లు వార్డుల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ భవన నిర్మాణాలను గుర్తించాలన్నారు.
సర్వే నంబర్, ఇంటి నంబర్, ప్లాట్ నంబర్, భవన నిర్మాణ అనుమతుల వివరాలు సేకరించి కేటాయించిన ట్యాబ్లలో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను గుర్తించి ఆ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ టీంకు అందజేస్తే టీఎస్బీపాస్ ప్రకారం ఆ నిర్మాణాలను కూల్చివేయడం లేదా భవనాలను సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. న్యాక్ ఇంజినీర్లు ఈరోజు నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా, అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలన్నింటిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ సిటీ ప్లానర్ ఉమాదేవి, ఏఎంసీ శ్రీకాంత్రెడ్డి, న్యాక్ ఇంజినీర్లు పాల్గొన్నారు.