తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప
మక్తల్ రూరల్, ఏప్రిల్ 4: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్ల పాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి పెద్ద, పెద్ద పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపిస్తున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్గనర్ పట్టభద్రుల స్థానాలకు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టంకట్టడమే నిదర్శనమని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. ఇదివరకు శాసన సభ్యుడిగా ఉన్న నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతి చెందారని ఆయన తెలిపారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన కుమారుడు నోముల భగత్ను ఓటర్లు ఆదరించాలని కోరారు.