‘బాలీవుడ్ చిత్రం ‘ఉరి’కి జాతీయ అవార్డులు వచ్చినప్పుడు కమర్షియల్ పంథాలో పడి మనం అలాంటి సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నామనే భావన నాలో కలిగింది. తెలుగు వాళ్లు అలాంటి కథల్ని అత్యద్భుతంగా తీయగలరని నాగార్జున ఈ సినిమా ద్వారా నిరూపించారు. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలున్నాయి. దేశభక్తిని ప్రబోధించిన సినిమా ఇది’ అని అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి.
సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ‘వైల్డ్డాగ్’ చిత్రబృందాన్ని అభినందించారు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. చిరంజీవి మాట్లాడుతూ ‘సినిమా చూశాను. అందరూ గర్వపడే గొప్ప సినిమా అనిపించింది. పాటలు, కామెడీ, రొమాన్స్ లాంటి వాణిజ్య హంగులు లేకుండా వాస్తవిక కథతో సినిమా తీసి రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడం చాలా కష్టం.
నన్ను గగుర్పాటుకు లోనుచేసి ఆద్యంతం ఉత్కంఠను పంచింది. సీట్ఏడ్జ్లో కూర్చొని చూశా. పతాక ఘట్టాల్లో నాగార్జున నటన చూసి చప్పట్లు కొట్టడమే కాకుండా జైహింద్ అని నినదించాను. ఇలాంటి కథలు, పాత్రలు ఎన్నుకుంటూ నాగార్జున సినిమాలు చేయడం గర్వకారణంగా అనిపిస్తోంది’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమాపై చిరంజీవి ప్రశంసలు అంతులేని ఆనం దాన్నిచ్చాయి. ఆదివారం రాత్రి సినిమా చూసి చిరంజీవి ఫోన్ చేశారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన గొప్ప సినిమా ఇదని అభినందించారు’ అని చెప్పారు.
‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సేకరించిన ఫంఢ్స్లో కొంత మొత్తం మిగిలి ఉంది. ఆ డబ్బుతో సినీ కార్మికులతో పాటు వారి కుటుంబాలకు కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందించాలని అనుకుంటు న్నాం’ అని చిరంజీవి తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి..