ప్రైవేటు స్కూళ్లలో అత్యంత తక్కువ వేతనాలు పొందేది అందులో పనిచేసే ఆయాలు, స్కూల్ బస్సు డ్రైవర్లే! కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో స్కూళ్లు మూతపడి.. కొన్నింటిలో ఆన్లైన్లోనే క్లాసులు సాగుతున్న నేపథ్యంలో ఆయాలు, బస్సు డ్రైవర్ల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో వారి కష్టాలనూ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. తాను అందించే రెండువేల రూపాయల ఆర్థిక సాయం, 25 కిలోల సన్నబియ్యం పంపిణీలో వారికీ అవకాశం కల్పించింది. యూడైస్లో నమోదు కాని పక్షంలో స్కూల్లో పనిచేసినట్టు ఆధారాలు చూపిస్తే చాలంటూ వెసులుబాటు కూడా ఇచ్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి అందివ్వనున్న కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు టీచర్లు, క్లర్కులు, అకౌంటెంట్లు, లైబ్రరీ, ల్యాబ్ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులని పేర్కొనగా, తాజాగా ఆయాలు, డ్రైవర్లను కూడా ఆ జాబితాలో చేర్చారు.
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో పేర్లు నమోదుకాని వారు కూడా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు పాఠశాలలో పనిచేసినట్టు ఆధారాలు చూపించాలని అధికారులు తెలిపారు. ఈ పథకానికి తొలిరోజే 2,562 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులకు అవకాశమివ్వగా, భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు.
హాజరు రిజిస్టరే ప్రామాణికంఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు జిల్లాలవారీగా బృందాలను ఏర్పాటుచేస్తున్నారు.
మండలం లేదా పాఠశాలల సంఖ్య యూనిట్గా తీసుకుని ఈ బృందాలు ఏర్పాటవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 5 స్కూళ్లకు, మరికొన్ని జిల్లాల్లో 20 స్కూళ్లకు ఒక బృందం చొప్పున నియమించారు. 2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసినవారంతా అర్హులేనని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో హాజరు రిజిస్టర్ను ప్రమాణికంగా తీసుకొని పరిశీలన జరపనున్నారు. హాజరు రిజిస్టర్లో పేరులేకుంటే అక్విటెన్స్ రిజిస్టర్, లేదంటే బ్యాంకు స్టేట్మెంట్లను లబ్ధిదారులు రుజువుగా చూపాలని అధికారులు సూచించారు. స్కూళ్లలో పనిచేస్తున్నా ఒకవేళ పాఠశాలలు విస్మరిస్తే వారి దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతీ జిల్లాలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటుచేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఒకే పాఠశాల నుంచి అధికంగా దరఖాస్తులు వస్తే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం 30 మందికి ఒక టీచర్ చొప్పున లబ్ధిదారులను ఎంపికచేయనున్నారు.