హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): చిన్నారుల మీద కరోనా పంజా విసురుతున్నది. గత ఏడాదితో పోల్చుకొంటే.. ఈ ఏడాది పిల్లల్లో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ విషయం న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. కరోనా మొదటి వేవ్లో ఎక్కువగా మధ్య వయస్కులు కరోనా ప్రభావానికి లోనుకాగా రెండో విడుతలో 15 ఏండ్లలోపు పిల్లల మీద కూడా ప్రతాపం చూపిస్తున్న ది. చాలామంది పిల్లల్లో లక్షణాలు బయటకు కనిపించడం లేదు. వారిద్వారా ఇంట్లోని పెద్దలకూ వ్యాపిస్తున్నది. గత మార్చిలో 296మంది చిన్నారులకు కొవి డ్ పరీక్షలు చేయగా వీరిలో 63 పాజిటివ్ (21 శాతం) కేసులొచ్చాయి. ఏప్రిల్లో 9వ తేదీ వరకు 159 మంది పిల్లలకు టెస్టులు చేయగా 49 మందికి (31శాతం) పాజిటివ్గా తేలిందని న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ వెల్లడించింది. హైదరాబాద్లో ఈ అధ్యయనం చేసినట్టు పేర్కొన్నది. గత ఏడాది మే, జూన్ నెలల్లో చిన్నారుల్లో పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ, నవంబర్, డిసెంబర్లో తగ్గుముఖం పట్టాయి. మళ్లీ మార్చినుంచి కేసులు పెరుగుతున్నా యి.‘ప్రస్తుతం చిన్నారుల్లో కొవిడ్ పాజిటివిటీ పెరగడాన్ని గుర్తించాం’అని న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ చీఫ్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ శరణ్య నారాయణ్ పేర్కొన్నారు.