మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ విద్యుత్ కార్మికుల పక్షపాతి. అడగకుండానే విద్యుత్ కార్మికులకు వరాలు ఇచ్చిన మహానేత అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. అటువంటి సంస్థను పరిరక్షించు కోవడంలో కార్మికులు ముందుండాలని ఆయన కోరారు.
కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుందని ఆయన చెప్పారు.
కార్మికులే సంస్థలకు యజమానులలుగా భావించిన రోజున అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో జరిగిన 1104 విద్యుత్ కార్మిక రాష్ట్ర జెనరల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు పద్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థల మనుగడ అందులో పనిచేసే కార్మికుల పనితీరు మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఈ రోజు విద్యుత్ రంగ సంస్థలు నిలదొక్కుకున్నాయి అంటే అందులో పనిచేస్తున్న కార్మికుల నిబద్ధతతో మాత్రమేని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర వాంఛ సరైనదేనని రుజువు పర్చింది కుడా విద్యుత్ రంగమేనన్నారు.
రాష్ట్రం ఆవిర్భవించిన రోజున విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 600 మేగావాట్ల ఉంటే అది ఇప్పుడు16000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెరిగిందన్నారు. అంతేకాకుండా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 70 మెగావాట్లకు పరిమితమైన సోలార్ ఇప్పుడు 4000 మెగావాట్లకు చేరిందన్నారు.
అందుకు కారణం ఆయా సంస్థలలో పనిచేసే కార్మికులే కారణమన్నారు. ఏ విద్యుత్ తో తెలంగాణ లో నాశనం అయింది అనుకుంటున్న వ్యవసాయ రంగానికి గడిచిన నాలుగేండ్లుగా నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుంది అంటే అందుకు కార్మికులు పడిన శ్రమనే కారణమని ఆయన తేల్చి చెప్పారు.
2012-13 ప్రాంతంలో విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు రోడ్లెక్కి ధర్నాలు చేసిన సందర్భాన్ని ఆయన ఉటంకిస్తూ తెలంగాణా ఏర్పాటు జరిగితే పరిశ్రమలు తరలి పోతాయంటూ బెదిరించిన ఉదంతాలను మంత్రి గుర్తు చేశారు. అందుకు భిన్నంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం కొత్తగా 50 వేల పరిశ్రమలు అదనంగా రావడమే కాకుండా 18 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సాయిబాబా, సంఘం ప్రతినిధులు జనార్దన్ రెడ్డి, శంకర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.