వరంగల్: రైతుల పంట రుణాల మాపీలో భాగంగా ఆగస్టు 16వ తేదీ నుంచి మొత్తం రూ.2006 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని శాసనమండలి సభ్యుడు, తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్ మండల కేంద్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఆత్మబంధువుగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
ఇప్పటికే రూ.25 వేలలోపు రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి రూ.50 వేల లోపు రుణాలను మాపీ చేయనుందన్నారు. కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, పంటల పెట్టుబడి కోసం రైతుబంధు ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం, చనిపోయిన రైతులకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు, 24 గంటల నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించిన సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని పల్లా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రైతుల నుంచి నేరుగా పంటలను కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ధర్మసాగర్లో కేంద్ర సహకార బ్యాంకు ప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ సహకార బ్యాంకులలో పంట రుణాలే కాకుండా గృహ రుణాలు, మార్ట్ గేజ్ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు తక్కువ వడ్డీకి ఇవ్వనుండటం గొప్ప విషయమని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, ధర్మసాగర్ PACS చైర్మన్ & డీసీసీబీ డైరెక్టర్ గుండేటి రాజేశ్వర్ రెడ్డి, వేలేరు ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీలు డా.పిట్టల శ్రీలత, చాడ సరితా రెడ్డి, ధర్మసాగర్ మండల అధ్యక్షులు & మండల రైతుబంధు సమితి కన్వీనర్ సోంపేల్లి కరుణాకర్, జడ్పీ కోఆప్షన్ జుబేధా లాల్ మహమ్మద్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి, సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ చంద్ర , ఎంపీటీసీ బొడ్డు శోభ-సోమయ్య, PACS వైస్ ఛైర్మన్ యాద కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.