హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీచేయాలని నిర్ణయించడం పట్ల తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది. తమ సమస్యలన్నీ తీరుస్తున్న సీఎంకు జీవితకాలం రుణపడి ఉంటామని పేర్కొన్నది. ప్రభుత్వోద్యోగాల్లో స్థానికులకు న్యాయంచేయడం కోసం కొత్త జోనల్ విధానాన్ని రూపొందించి.. రాష్ట్రపతి ఆమోదం పొందేలా కృషిచేసిన సీఎం కేసీఆర్ను తెలంగాణ యువత కలకాలం గుర్తుపెట్టుకొంటుందన్నారు. మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పలు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు మామిళ్ల రాజేందర్, మమత తెలిపారు.
ఈహెచ్ఎస్ను పటిష్ఠంగా అమలుచేయాలి
ఒక శాతం చందాతో ఆరోగ్య కార్డుల ద్వారా ఉద్యోగులకు నగదు రహిత వైద్యాన్ని అమలుచేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం పీఆర్సీ సూచించినట్లు ఒక శాతం మూల వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ ఫండ్కు ఇవ్వడానికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయడం కోసం జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో వ్యత్యాసాలను సవరించడం కోసం అనామలీస్ కమిటీని చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీతో ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు వ్యక్తిగతంగా వాహనాలు కంప్యూటర్లు, కొనుక్కోవడానికి, ఉన్నత విద్యావకాశాల కోసం విద్యారుణాలు తీసుకోవడం కోసం గతంలో ప్రభుత్వమిచ్చిన విధంగానే బ్యాంకుల ద్వారా విరివిగా తకువ వడ్డీకి అన్నిరకాల రుణాలు మంజూరుచేయాలని సీఎం కేసీఆర్ను కోరినట్టు వెల్లడించారు. ఉద్యోగులకు గృహ రుణాలను ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రీతిలోనే బ్యాంకుల ద్వారా హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూల్స్ అనుగుణంగా 50 లక్షల వరకు రుణాన్ని మంజూరుచేయించాలని కోరామని తెలిపారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ నాలుగు, మూడవ తరగతి ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణకు తీసుకొని వచ్చినందుకు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా మిగిలిఉన్నవారిని కూడా తీసుకొనిరావాలని విన్నవించారు.