ముంబై : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్తో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. అదుపులోకి తీసుకువచ్చేందుకు కర్ఫ్యూ అమలు చేస్తున్నా పరిస్థితి ఘోరంగా మారుతోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి వైద్యం అందించేందుకు అతని కొడుకు పడరాని పాట్లు పడుతున్నాడు. 24 గంటల పాటు రెండు రాష్ట్రాల్లోని హాస్పిటళ్లు తిరిగినా ఒక్క బెడ్ కూడా దొరకని దుస్థితి ఎదురైంది. చివరకు అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా నిండుకోవడంతో ఈ పరిస్థితుల్లో ఇంటికి తీసుకువెళ్లలేనని.. హాస్పిటల్లో బెడ్ అయినా ఇవ్వాలని.. లేదంటే ఇంజక్షన్ ఇచ్చి చంపమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్లో బుధవారం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో నివసించే సాగర్ కిశోర్ నహర్షివర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కోసం మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని పలు హాస్పిటళ్లను తిరిగాడు. అయినా తండ్రికి చికిత్స అందించలేకపోయాడు. సాగర్ తన తండ్రితో చంద్రాపూర్కు చేరుకున్నాడు. పలు హాస్పిటళ్లు తిరిగినా బెడ్లు అందుబాటు లేవు. రాష్ట్రంలో అకస్మాత్తుగా కొవిడ్ రోగుల సంఖ్య పెరుగడంతో హాస్పిటళ్లలో వైద్య సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో 24 గంటలు ఆసుపత్రులు మూసివేశారు.
మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి హాస్పిటళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా కనికరించడం లేదని సాగర్ వాపోయాడు. మొదట చంద్రాపూర్లోని వరోరా హాస్పిటల్కు వెళ్లానని, కానీ అక్కడ హాస్పిటల్ తండ్రి బెడ్ దొరకలేదని చెప్పాడు. ఆ తర్వాత పలు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లినా లాభం లేకపోయిందని చెప్పాడు. చివరికు రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి 3 గంటలకు వెళ్లామని చెప్పాడు. అక్కడ సైతం చికిత్స అందించలేకపోయామని తెలిపాడు. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ ఉదయం తిరిగి మహారాష్ట్రకు తిరిగి వచ్చామని చెప్పాడు. ప్రస్తుతానికి తన తండ్రి అంబులెన్సులోనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానికులను కదిలించి వేస్తోంది. మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుండడంతో ఇప్పటికే పలు హాస్పిటళ్లు నిండిపోయాయి. దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. దీంతో హాస్పిటళ్లకు పెద్ద ఎత్తున రోగులు వస్తుండడంతో ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల బెడ్లు నిండిపోయాయి. పలు చోట్ల నేలపైనే ఉంచి బాధితులకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అహ్మదాబాద్లో ఆసుపత్రి వెలుపల అంబులెన్స్లలోనే కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు కనిపించాయి. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు పెరుగుతున్న జనం ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు. మాస్క్లు ధరించాలని, సామాజిక దూరం నిబంధనలు పాటించాలని అధికారులు ఎంత మొత్తుకుంటున్న చెవికెక్కించుకోవడం లేదు. మరో వైపు మాస్క్లు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోజువారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రెండు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవగా.. రికార్డు స్థాయిలో 1,038 మంది మృత్యువాతపడ్డారు.