న్యూఢిల్లీ: గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా.. చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగన్ నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో చైనా నుంచి భారత్ 58.71 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నది. భారత్కు అత్యంత మిత్రదేశంగా పరిగణిస్తున్న అమెరికా రెండో స్థానంలో ఉండగం ఆసక్తికర పరిణామం.
చైనా, అమెరికాలతోపాటు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి భారత్ వివిధ వస్తువులు దిగుమతి చేసుకున్నదని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. లోక్సభలో త్రుణమూల్ సభ్యులు మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు మంత్రి పూరీ సమాధానమిస్తూ పై విధంగా చెప్పారు.
చైనా నుంచి 58.71 బిలియన్ల డాలర్లు, అమెరికా నుంచి 26.89 బిలియన్ల డాలర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 23.96 బిలియన్ల డాలర్లు, సౌదీ నుంచి 17.73 బిలియన్ల డాలర్లు, ఇరాక్ నుంచి 16.26 బిలియన్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకున్నట్లు హర్దీప్సింగ్పూరీ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 371.98 బిలియన్ల డాలర్ల విలువైన భారత్ గతేడాది దిగుమతి చేసుకున్నది. అందులో టాప్-5 దేశాల నుంచి 143.55 బిలియన్ల డాలర్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. అవి మొత్తం దిగుమతుల్లో 38.59 శాతం అని తెలుస్తున్నది.