హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం 33,930 నమూనాలను పరీక్షించగా, 403 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు సోమవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ వివరించింది. గ్రేటర్ హైదరాబాద్తోపాటు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తిపెరిగింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 146, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, రంగారెడ్డిలో 34, సంగారెడ్డిలో 24, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరిలో 11 చొప్పున, కరీంనగర్, నిజామాబాద్లో 10 చొప్పున, వరంగల్ అర్బన్, జగిత్యాలో 9 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. ఆదివారం 31,325 వైరస్ నిర్ధారణ పరీక్షలుచేయగా, 997 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా చిత్తూరులో 181 కేసులు నమోదయ్యాయి.
రెండోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా కొనసాగుతున్నది. ఆదివారం 9,962 మంది తొలిడోస్ వేసుకోగా, ఐదుగురు రెండోడోస్ తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 9.38 లక్షలకు చేరగా, రెండుడోసులు తీసుకున్నవారి సంఖ్య 2.34 లక్షలకు చేరింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా కేవలం 0.85 శాతం మాత్రమే ఉన్నదని, ఇది దేశంలోనే అత్యల్పమని సోమవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది.