కంది, మార్చి 30 : ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతే ఏమీ కాదు.. అనే ధోరణి ఇకపై జిల్లాలో ఎక్కడా చెల్లదు. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం కచ్చితంగా 7 రోజుల నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతోపాటు బండిని కూడా కనీసంగా 15-20 రోజుల వరకు స్టేషన్లో సీజ్ చేస్తారు. జిల్లాలో పోలీసులు రోజూ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఎక్కడ.. ఎప్పుడు చేస్తామనేది అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఇక డీడీ (డ్రంకెన్ డ్రైవ్)లో పట్టుబడిన వారికి జైలు శిక్షతోపాటు బండి సీజ్ చేస్తారు. పట్టుబడ్డ వారి కుటుంబ సభ్యులను పిలిచి జిల్లా పోలీసు కార్యాలయ క్వార్టర్స్ ఆవరణలో నూతనంగా ప్రారంభించిన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లోనే వారికి కౌన్సెలింగ్తో పాటు ఇతర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అయితే సంగారెడ్డి జిల్లాలో మొత్తం 10 వేల పైచిలుకు ఆటోలు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించగా, ఇందులో ఇప్పటికే 5,256 ఆటోలకు పోలీసుల ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్లు అమర్చారు.
మద్యం తాగి దొరికితే కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్…
జిల్లాలో ఇకపై ఎవరైనా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే సాధరణంగా జైలు శిక్షతోపాటు బండిని సీజ్ చేసి స్టేషన్కు తరలిస్తారు. దీంతోపాటు హైదరాబాద్ తరహా ఇక్కడ కూడా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు మరుసటి రోజు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. ఈ కౌన్సెలింగ్ సెంటర్ను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని గ్యాస్ గోదాం పక్కనే కొత్త భవంలో కౌన్సెలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరిలో 66, ఫిబ్రవరిలో 44, మొత్తం 110 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రహ్మన్ తెలిపారు.
ఆటోలకు క్యూర్ కోడ్ తప్పనిసరి..
జిల్లాలో ఉన్న పత్రి ఆటోకు ఇకపై తప్పనిసరిగా క్యూర్ కోడ్ ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో సుమారు 10 వేల పైచిలుకు ఆటోలను పోలీసులు గుర్తించి అందులో 5 వేల పైచిలుకు ఆటోలకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయించారు. ఈ పద్ధతి ద్వారా ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఆటలోపల ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆటో నెంబర్తో సహా డ్రైవర్, ఆటో ఓనర్ పూర్తి వివరాలు మొబైల్లో వస్తాయి. దీని ద్వారా ఏమైనా జరగరాని ఘటనలు జరిగితే సులువుగా ఆటోను నడిపిస్తున్న డ్రైవర్ను గుర్తించే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ లేకుండా ఆటోలు నడిపిస్తే అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆటోలో క్యూఆర్ కోడ్ వేసుకోవడానికి ఏడాదికి రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
నూతన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం..
జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్ ద్వారా ప్రజలకు ట్రాఫిక్పై అవగాహన కల్పిస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే వారికి ఇక్కడే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. ఈ నూతన సెంటర్ ద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సృజన, సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, ట్రాఫిక్ సీఐ ముజీబ్ ఉర్ రెహమాన్, పట్టణ సీఐ రమేశ్, ఆర్ఐలు హరిలాల్, డానియల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు…
జిల్లా పరిధిలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా కొంతమంది యువకులు శబ్ధ కాలుష్యం చేసేలా బులెట్ వాహనాలకు వేరే సైలెన్సర్లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మా దృష్టి వచ్చింది. ఇప్పటికే అలాంటి వాహనాలను గుర్తించి అతి శబ్ధ కాలుష్యం వచ్చే సైలెన్సర్లను తీసివేయించడమే కాకుండా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించాం. ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.
ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు…
రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపించి ఇబ్బందులు కలిగించినా.. లేక ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిం చి ప్రవర్తించినా నేరుగా ట్రా ఫిక్ సీఐ 9490617026 లేదా 100కు సమాచారం ఇవ్వాలి. ట్రాఫిక్ ఇబ్బందులుంటే 100కు కాల్ చేస్తే పోలీసులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారు
ఇవీ కూడా చదవండి..
ఆర్థిక క్రమశిక్షణలో తెలంగాణ భేష్
పంచాయతీల నిర్ణయం మేరకే నిధుల ఖర్చు : సీఎం కేసీఆర్
ఇటువంటి పథకం భూ మండలంలో లేదు