కేసీఆర్ పాలనకు మేధావుల మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండోసారి రాజేశ్వర్రెడ్డి గెలుపు
ఎలిమినేషన్ రౌండ్స్లో వరించిన విజయం
తొలి ప్రాధాన్యతా ఓట్లలోనే స్పష్టమైన ఆధిక్యం
రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న… ఆ తర్వాత కోదండరాం
బీజేపీ, కాంగ్రెస్లు నాలుగు, ఐదు స్థానాలకు పరిమితం
పెద్దగా ప్రభావం చూపని జయసారథి, చెరకు, రాణీరుద్రమ
స్వతంత్ర అభ్యర్థులకు నామమాత్ర ఓట్లు
90గంటల పాటు సుదీర్ఘంగా సాగిన లెక్కింపు ప్రక్రియ
వరంగల్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు పట్టభద్రులు మరోసారి జైకొట్టారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి స్థానానికి టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన పల్లా రాజేశ్వర్రెడ్డిని రెండోసారి గెలిపించి తాము మీ వెంటే అంటూ మద్దతునిచ్చారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని అందించి తదుపరి ప్రాధాన్యతా ఓట్లతో విజయం కట్టబెట్టారు. కుట్రలు, అసత్య ఆరోపణలతో ఓటర్లను గందరగోళంలో పడేయాలని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ సహా ఇతరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. మొత్తం 3,66,333 ఓట్లు చెల్లుబాటు కాగా టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర్రెడ్డికి 1,61,811 ప్రాధాన్యతా ఓట్లు దక్కగా తీన్మార్ మల్లన్నను ద్వితీయ స్థానానికి పరిమితం చేశారు.
పట్టభద్రులు మరోసారి టీఆర్ఎస్కు పట్టం కట్టారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. 71 మంది బరిలో నిలువగా ఓటర్లు పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. యువత, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగులంతా టీఆర్ఎస్కే మద్దతు తెలిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి తాజాగా మరోసారి విజయం సాధించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ తీర్పు అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నా రు. వరంగల్ జిల్లాకు చెందిన పల్లా ఎమ్మెల్సీగా ఎన్నికవడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించిన సురభి వాణీదేవికి వరంగల్ నగరంతో అనుబంధం ఉన్నది. వరంగల్ అర్బన్ జిల్లాలోని వంగర ఆమె సొంతూరు. ఇద్దరు ఎమ్మెల్సీలు వరంగల్తో అనుబంధం ఉన్న వారే కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ విజయం టీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలానిచ్చినట్లయిందని పలువురు భావిస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త విజయమని, సీఎం కేసీఆర్ పాలనకు పట్టభద్రులు మద్దతు ఇచ్చారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
పట్టభద్రులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, మార్చి 20: పట్టభద్రులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన సందర్భంగా హన్మకొండలో జరిగిన సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జన్ను జకార్యతో కలిసి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ విజయం ప్రజలందరిదన్నారు. ఈ విషయంతో రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ నినాదాల నడుమ నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగితేలారు.
సీఎం కేసీఆర్ది గొప్ప పాలన..
సీఎం కేసీఆర్ది గొప్ప పరిపాలన. అందుకే పట్టభద్రులు ఆమోదించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఉద్యమ నాయకుడైన సీఎం కేసీఆర్ వెంటే పట్టభద్రులు ఉన్నారని మరోసారి రుజు వైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను సీఎం పరిష్కరిస్తారని నమ్మకం ఉండడంతోనే వారు ఆయన వెంట ఉన్నారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలువడంతో ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్దే విజయమని మరోసారి రుజువైంది.
వాణీదేవిని గెలిపించిన అందరికీ ధన్యవాదాలు..
హన్మకొండ చౌరస్తా : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణీదేవిని గెలిపించిన పట్టభద్రులకు ధన్యవాదాలు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరినా ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడం బాధాకరం. ముఖ్యంగా బీజేపీ హిందుత్వ భావానికి రామజన్మభూమి ద్వారా ప్రాధాన్యం కల్పించింది పీవీయే. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకు పీవీ వల్లే రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అయినా ఈ రెండు పార్టీలు వాణీదేవిపై పోటీ చేయడం సరికాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం వల్లే పేద బ్రాహ్మణులకు న్యాయం జరిగింది.
-గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రభుత్వ పనితీరే గెలిపించింది..
భూపాలపల్లి: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరే రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించింది. మేధావులు, ఉద్యోగులు, యువత టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఇన్నాళ్లు యాగి చేసిన వారికి ఈ విజయం చెంపపెట్టులాంటిది. సింగరేణి పట్టభద్రులు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు.