హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ నర్సులందరికీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్యచికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో, సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని ఆయన కొనియాడారు.
నర్సులకు మంత్రుల శుభాకాంక్షలు
రోగులకు వైద్యసేవలు అందిస్తున్న నర్సులందరికీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో నర్సుల త్యాగం, అంకిత భావం గుర్తుచేసుకోవడం సమంజసమని అన్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కొవిడ్ బారినపడిన వారికి చికిత్స అందిస్తున్న నర్సుల సేవలు అమూల్యమైనవని తెలిపారు. వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు.
మీ సేవలకు సలాం: గవర్నర్ తమిళిసై
కోవిడ్ సంక్షోభ సమయంలో నర్సులు అసమాన సేవలందిస్తున్నారని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ పక్కన గల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బుధవారం జరిగిన వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. కొవిడ్పై పోరులో నర్సులు అందిస్తున్న సేవలను కొనియాడారు. వారి సేవలకు గవర్నర్ సెల్యూట్ చేశారు. గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పీ సౌందర్రాజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నర్సమ్మలూ.. మీకు రుణపడి ఉంటాం: మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): సేవకు మరోపేరు నర్సులని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న నర్సులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. పేషెంట్లను అమ్మలా చూసుకుంటారు కాబట్టే వారిని ‘నర్సమ్మా’అని గౌరవంగా పిలుస్తామన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో డాక్టర్ల కంటే నర్సుల పాత్రే ఎక్కువని హరీశ్ పేర్కొన్నారు.
వైద్యరంగానికి వెన్నెముక నర్స్: ఎమ్మెల్సీ కవిత
వైద్య రంగానికి నర్సులు వెన్నెముక వంటివారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్స్ల దినోత్సవం సందర్భంగా ఆమె నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో తమ శక్తియుక్తులన్నీ ధారపోస్తూ బాధితులకు అత్యున్నత సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రోగులకు రక్షణ కవచంగా నర్సులు సర్వశక్తులు ఒడ్డి సేవలు అందిస్తున్నారని ఆమె కీర్తించారు. వైద్య వ్యవస్థలో నర్సులు వెన్నెముకగా వ్యవహరిస్తున్నారని ఆమె ఈ మేరకు ట్వీట్ చేశారు.