హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కులవృత్తులను ఒకొకటిగా గాడిన పెడుతూ వస్తున్నామని.. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న నిర్విరామ కృషి ఫలితంగా గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్ఠమవుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. తెలంగాణ సబ్బండవర్ణాల్లో గుణాత్మకమార్పులతో గ్రామీణ జీవనంలో వెలుగులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని చెప్పారు. తెలంగాణలో గొల్ల కురుమలు,యాదవుల కోసం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం, బెస్తలు, ముదిరాజ్ల కులవృత్తి అభివృద్ధికోసం అమలుచేస్తున్న చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయని తెలిపారు. తెలంగాణలో వృత్తిజీవనం సబ్బండవర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని.. దాదాపు కులవృత్తులన్నింటినీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో వారిని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఇందులోభాగంగా అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. పాత పద్ధతిలోనే గొర్రెల యూనిట్సంఖ్య ఉంటుందని చెప్పారు. గతంలో రూ.1.25,000గా ఉన్న యూనిట్ ధరను మాత్రం రూ.1,75,000 కు పెంచుతున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే డీడీలు కట్టిన 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల ఉత్పత్తిలో రాజస్తాన్ను అధిగమించి తెలంగాణ దేశంలో నంబర్వన్ స్థానానికి చేరుకున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.5 వేల కోట్లతో చేపట్టిన మొదటివిడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. రెండువిడతల్లో కలుపుకుని తెలంగాణ గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా రూ.11వేల కోట్లు కేటాయించినట్లవుతుందన్నారు. ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ను అదేసంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ వర్గాల అభ్యున్నతి- ప్రభుత్వ కార్యాచరణ, రెండోవిడత గొర్రెల పంపిణీ అంశాలపై మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
‘సమైక్యపాలనలో వ్యవసాయాన్ని నాశనం చేశారు. అనుబంధ కులవృత్తులను ధ్వంసంచేశారు. గ్రామీణ జీవన ముఖచిత్రం కుప్పకూ ల్చారు. నాటి పాలకులకు తెలంగాణ సబ్బండవర్గాల వృత్తి జీవనంలోని ప్రత్యేకత, వైవిధ్యం అర్థం కాలేదు, వారికి ఆ సోయి కూడా లేదు. అద్భుతమైన వృత్తి నైపుణ్యం కలిగిన బీసీ వర్గాలను అల్లుకొనే తెలంగాణలో కులవృత్తుల జీవ నం కొనసాగింది. ఉత్పత్తి, సేవారంగాల్లో భాగస్వామ్యమైన సబ్బండవర్గాలు కొనసాగించే కులవృత్తులతో గ్రామీణ ఆర్థికవ్యవస్థ ముడిపడి ఉంటుంది. అవన్నీకూడా వ్యవసాయాన్ని అల్లుకొని కొనసాగుతాయి. ఉత్తరభారతంలో మాది రి కాకుండా వృత్తి కులాలన్నీ బీసీ వర్గాలే అధికశాతం నిర్వహించడం తెలంగాణకు ప్రత్యేకం. ఆ ప్రత్యేకతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారందరికీ అండగా నిలిచింది. మిషన్ కాకతీయ పథకం ప్రారంభంతో మొదలైన స్వరాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానం.. తాగు, సాగునీటి వ్యవస్థలను మెరుగుపరిచింది. గ్రామానికి ఆదెరువుగా ఉన్న చెరువులను జలాలతో నింపి, సజీవంగా ఉంచింది. ధ్వంసమైన కులవృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా ఏడేండ్లుగా పాలన కొనసాగిస్తున్నది. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని అన్నిరాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది’ అని సీఎం వివరించారు.
వ్యవసాయం అంటే పాడిపంట అని.. పంటలతోపాటు పాల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామి దిశగా పయనిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. పాలఉత్పత్తిదారులకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడంతోపాటు, పలు విధాలుగా అండదండలందిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీతోపాటు, కరీంనగర్ డెయిరీ వంటి పాలఉత్పత్తి సంస్థలు ప్రతిభావంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
గొర్రెల యూనిట్ ధర పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా కూడా పెరిగింది. గొర్రెల పంపిణీలో భాగంగా యూనిట్కు అయ్యే ఖర్చులో ప్రభుత్వం 75శాతం భరిస్తుండగా, లబ్ధిదారులు 25శాతం చెల్లిస్తున్నారు. యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంచడంతో ప్రభుత్వం రూ.1,31,250 చెల్లిస్తుండగా.. లబ్ధిదారుడు రూ.43,750 భరించాల్సి ఉంటుంది.
‘వ్యవసాయం తర్వాత పెద్దఎత్త్తున ఆధారపడిన కులవృత్తి చేనేత రంగం. బ్రాహ్మణులతో సమానంగా గౌరవాన్ని పొందిన పద్మశాలివర్గం సమైక్య పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలకు బలైపోయింది. తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధి, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకున్నది. గాయాలపాలైన చేనేత వృత్తి గాడిన పడుతున్నది. కల్లుగీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలుసహా, నాయిబ్రాహ్మణ, రజక తదితర వృత్తుల అభ్యున్నతికి వినూత్న పథకాలను ప్రభు త్వం అమలుచేస్తూ అభివృద్ధి పథాన నడిపిస్తున్నది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
చేపల పెంపకం వృత్తిని నిర్వహించే బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజ్ల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మత్స్య సంపద రోజురోజుకూ విస్తరిస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత రిజర్వాయర్లు నిండి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని అన్నారు. కృష్ణా, గోదావరీ నదుల పరీవాహక ప్రాం తంలో నీటినిల్వ నిరంతరం ఉంటున్నదని తెలిపారు. మిషన్భగీరథ, ఇన్టేక్వెల్స్సహా నీటినిల్వ ఉండే ప్రతి అవకాశాన్ని చేపల పెంపకం కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచితచేపల పంపిణీ అద్భుత ఫలితాలు అందిస్తున్నదని తెలిపారు ప్రతి చెరువులో మత్స్య సంపద పెద్దఎత్తున అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇతరప్రాంతాల్లో నుంచి తెలంగాణకు చేసుకునే చేపల దిగుమతి తగ్గిందని చెప్పారు. దేశంలోని పట్టణాలు, నగరాలకు తెలంగాణ నుంచి చేపల ఎగుమతి కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రా మాల్లో చెరువుల్లో చేపల ఉత్పత్తి ప్రక్రియ మత్స్యశాఖ పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. చేపల పెంపకం సొసైటీలో 18 ఏండ్లు నిండిన యువతకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శులు స్మితాసబర్వాల్, భూపాల్రెడ్డి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెండోవిడత గొర్రెల పంపిణీకి ఆమోదం తెలిపడంతోపాటు, రూ.6 వేల కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని గొల్ల, కురుమల తరఫున కృతజ్ఞతలు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వీరికి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. సమాజంలో ఉన్నతస్థితిలో నిలిపేందుకు చర్యలు తీసుకున్నారు. వారు చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం
అద్భుతమైన ఫలితాలను అందించింది. గొల్ల కురుమల కోసం రెండువిడతల్లో రూ.11 వేల కోట్లు ఖర్చు చేయడం ఒక్క సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. సీఎం ఆమోదం లభించడంతో వీలైనంత త్వరలోనే రెండోవిడత గొర్రెల పంపిణీ చేపడుతాం.
–తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధకశాఖ మంత్రి