హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, అతి తక్కువ సమయంలోనే అపూర్వప్రగతి సాధించి చాలా అంశాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. బంగారు తెలంగాణ నిర్మాణం వైపు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో సీఎం కేసీఆర్ నిరంతర తపన, కృషిని అభినందించారు. గవర్నర్తో సీఎం కేసీఆర్ బుధవారం రాజ్భవన్లో భేటీఅయ్యారు. గవర్నర్కు పుష్పగుచ్ఛమిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకేరోజు కావడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సీఎం కేసీఆర్ను సత్కరించారు. గవర్నర్కు మంత్రి సత్యవతిరాథోడ్ శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను రాజ్భవన్లో నిరాడంబరంగా నిర్వహించారు. అనంతరం పేదలకు, ఫ్రంట్లైన్ వర్కర్లకుకు గవర్నర్ నిత్యావసరాలను పంపిణీచేశారు. అనాథలకు లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ కిట్స్ అందజేశారు. కరోనా విపత్తులో సేవలందించిన గాంధీ, కింగ్కోఠి, ఆయుర్వేదిక్ దవాఖాన సూపరింటెండెంట్లు డాక్టర్ రాజారావు, డాక్టర్ రాజేంద్రనాథ్లను సన్మానించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్భగవత్, మిలటరీ అధికారులు ఏ జోషి, ఇందర్దీప్సింగ్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధి కే పిచ్చిరెడ్డిని గవర్నర్ సన్మానించారు.