హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతికోసం బౌద్ధం చూపినబాట నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి, సహనంతో కూడిన అహింసాయుత జీవనవిధానం, వాటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని సీఎం వివరించారు. ఫణిగిరి లాంటిచోట్ల నాటి బౌద్ధారామాల్లో బయల్పడుతున్న అరుదైన చారిత్రక సంపద, గోదావరి కృష్ణా పరీవాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధకేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీవింపచేసి ప్రపంచ బౌద్ధపటంలో తెలంగాణకు సముచితస్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. ప్రజాసంక్షేమం, ప్రగతికోసం పాటుపడటం ద్వారా మాత్రమే గౌతమబుద్ధునికి నిజమైన నివాళి అర్పించగలుగుతామని, ప్రభుత్వం అదే దిశగా సాగుతున్నదని తెలిపారు.