న్యూఢిల్లీ, జూన్ 18: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కిమ్స్ దవాఖానల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు విజయవంతమయ్యాయి. మదుపరుల నుంచి ఈ ఐపీవోలకు విశేష స్పందన లభించింది. ఈ నెల 16న మొదలైన ఈ పబ్లిక్ ఇష్యూలు శుక్రవారం ముగిశాయి. మూడు రోజులపాటు సాగిన ఈ ఇష్యూల్లో దొడ్ల డైరీ 45.61 రెట్లు అధికంగా సబ్స్ర్కైబ్ అయ్యింది. కిమ్స్ సైతం 3.86 రెట్లు ఎక్కువగా ఆదరణ అందుకున్నది.
85.07 లక్షల ఈక్విటీ షేర్లను దొడ్ల డైరీ అమ్మకానికి పెట్టగా, వీటి కోసం ఏకంగా 38.80 కోట్ల బిడ్లు వచ్చాయి. రూ.520.17 కోట్ల ఈ ఐపీవోలో ఒక్కో షేర్ ధరల శ్రేణి రూ.421-428గా ఉన్నది. కాగా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ నుంచి 84.88 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్ మదుపరుల నుంచి 73.26 రెట్లు దరఖాస్తులు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 11.34 రెట్లు అధికంగా బిడ్డింగ్ జరిగింది. వీరికి రూ.2 లక్షల వరకు పెట్టుబడులకు అనుమతి ఉండగా, కనీసం 14,980 షేర్లకు, గరిష్ఠంగా 1,94,740 షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ నెల 15న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.156 కోట్లను సంస్థ సేకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఏపీసహా ఐదు రాష్ర్టాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న దొడ్ల డైరీ.. ఈ ఐపీవో నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, వ్యాపార విస్తరణకు వినియోగించనున్నది.
ఈ ఐపీవో ద్వారా కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ 1,44,13,073 షేర్లను విక్రయానికి పెట్టింది. అయితే మదుపరుల నుంచి 5,56,55,046 షేర్లకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. దీంతో 3.86 రెట్లు స్పందన లభించినైట్లెంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి 5.26 రెట్లు, నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 1.89 రెట్లు, రిటైల్ వ్యక్తిగత మదుపరుల నుంచి 2.89 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.2,143.74 కోట్ల విలువైన ఈ ఐపీవోలో ఒక్కో షేర్ ధరల శ్రేణి రూ.815-825గా ఉన్నది. ఇక ఐపీవోకు ముందే మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.955 కోట్లను కిమ్స్ సేకరించింది. షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో నమోదు కానున్నాయి. తెలంగాణ, ఏపీల్లో ప్రముఖ దవాఖానల్లో ఒకటైన కిమ్స్.. ఈ ఐపీవో నిధులను మరికొన్ని రాష్ర్టాల్లో విస్తరించడానికి ప్రధానంగా వినియోగించనున్నది.