హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన వాటిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతున్నది. సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు తక్షణమే పంపించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిరాశ్రయులకు, వసతి, బట్టలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి ఉన్నందున నాగార్జున సాగర్ కు ఉన్నతాధికారులను పంపించాలని ఆదేశించారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రప్పించాలని తెలిపారు. హెలికాప్టర్ లను మరిన్ని తెప్పించాలని, గతంలో వరదల పరిస్థితులను ఎదుర్కున్న అధికారులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.