హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కొవిడ్ సీఎంవో ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ కె.రమేష్ రెడ్డి, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టెక్నికల్ అడ్వైజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం… రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
స్వల్ప కాలానీకి నియమించుకున్న వైద్య సిబ్బందికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలన్నారు. అంతేకాకుండా వారు కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం ఆదేశించారు. కష్టకాలంలో ప్రజల కోసం సేవచేయడానికి ముందుకు రావాలని యువ డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాల్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తక్షణమే ప్రారంభించి, వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. పీఎంఎస్ఎస్వై కింద ఎంజిఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం అందచేయాల్సిన రూ. 8 కోట్లు, రిమ్స్ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద రూ. 20 కోట్ల రూపాయలను, మొత్తం రూ. 28 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. అదే సందర్భంలో వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 7393 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, 2470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్దంగా ఉన్నట్లు వైద్యాధికారులు సీఎంకు వివరించారు. కావాల్సిన మందులతో పాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కాగా ప్రైవేటు దవాఖానాల్లో రెమిడిసివర్ ఇంజక్షన్లను మరింతగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్బంగా సీఎం.. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్తో ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సిన పలు కీలక సూచనలను సీఎం కేంద్రమత్రికి వివరించారు.
కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్న కారకులను గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సీఎం సూచించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ బాయ్స్, స్ట్రీట్ వెండార్స్, ఇంకా పలు దిక్కులకు పోయి పనిచేసే కార్మికులు తదితరులను కరోనా వ్యాప్తి అధికం చేసే అవకాశాలున్న వారిగా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్ ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధికభాగం అరికట్టే అవకాశాముంటుందని సీఎం తెలిపారు. సీఎం సూచనల మీద సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి ప్రధానితో చర్చించి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.