జనగామ: కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో చేప పిల్లలు విడుదల చేసి.. జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో నీళ్లు, కరెంటు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మూడేండ్లలోనే దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తిచేసుకొని 365 రోజులు నీటికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉన్నామన్నారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఎండాకాలంలోనూ నీరందించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైనదన్నారు.
ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పధకాలతో రైతులకోసం ప్రభుత్వం రూ.2 లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. కరోనాతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతిందని, అయినా పేదల సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపకుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ కింద రూ.2116 ఇస్తుండగా, ఇతర రాష్ట్రాల్లో రూ.500, రూ. 600 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
కుర్మ, యాదవులకు గొర్రెలు, గౌడలకు 17 శాతం వైన్ షాపులు కేటాయిస్తున్నామని చెప్పారు. దళితులకు దళిత బంధు కింద రూ.10 లక్షలు వారి ఖాతాలో జమచేస్తున్నట్లు, పేదలందరినీ అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లు పండించాలని రైతులను మంత్రి కోరారు.
హన్మకొండ: ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వాక్సిన్ తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. హన్మకొండ జిల్లా హసన్పపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంచార కొవిడ్ టీకా వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లాకు 12 సంచార కోవిడ్ టీకా వాహనాలు అందించినందుకుగాను సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ వాహనాల ద్వారా కోవిడ్ టీకాలు వేగవంతం చేయడానికి, కరోనా నియంత్రణకై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.